Followers

13 August, 2020

పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి వర్ధంతి

@శ్రీనివాస్@

విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతున్న 'ప్రతిజ్ఞ' రూపశిల్పి "పైడిమర్రి వెంకటసుబ్బారావు" గారి వర్ధంతి నేడు...

బడి గంట కొట్టగానే విద్యార్థులందరూ బారులుదీరి వందేమాతర గీతం ఆలపిస్తారు.. ఆ తర్వాత ‘‘భారత దేశం నా మాతృభూమి/భారతీయులందరూ నా సహోదరులు/ నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’’ అంటూ దేశంలోని ప్రతి పాఠశాలలో పిల్లలు ప్రతిజ్ఞ పూనుతారు. పసి హృదయాల్లో అణుఅణువునా దేశభక్తిని ఉప్పొంగించే ఆ ప్రతిజ్ఞ రాసింది మరెవరో కాదు నల్లగొండ జిల్లా వాసి పైడిమర్రి వెంకటసుబ్బారావు. తెలుగుతోపాటు సంస్కృతం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ.. తొమ్మిది భాషల్లోకి అనువాదమై దేశమంతా పఠిస్తున్నారు ఆయన వ్రాసిన ఈ ‘ప్రతిజ్ఞ’...

పైడిమర్రి వెంకట సుబ్బారావు జూన్‌10, 1916న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా నల్లగొండ జిల్లాలోనే సాగింది. ఆయనకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిషు, అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హైదరాబాద్‌ ట్రెజరీ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన పైడిమర్రి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఖమ్మం, నిజామాబాద్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1962లో భారత్‌-చైనా యుద్ధం సందర్భంగా ‘తమ దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలని చైనా నిర్ణయించింది’. ఆ విషయాన్ని గుర్తించిన పైడిమర్రి మన దేశ బాలలందరి గుండెల్లో దేశ భక్తిని నింపాలన్న కాంక్షతో ‘భారత దేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రాశారు. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, ఆ విషయాన్ని నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. ఆ తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దాన్ని జాతీయ ప్రతిజ్ఞగా గుర్తించారు. దేశంలోని 9 భాషల్లో అనువదించి అన్ని పాఠశాలల్లో ఆ ప్రతిజ్ఞను పిల్లలతో నిత్యం చదివించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26, 1965 నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థులతో ఆ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలైంది.

పైడిమర్రి వెంకటసుబ్బారావు తన 18వ ఏట ‘కాలభైరవుడు’ నవల రాశారు. ‘దేవదత్తుడు’, ‘తులసీదాసు’, ‘త్యాగరాజు’ మొదలైన పద్యకావ్యాలు రచించారు. ‘బ్రహ్మచర్యం’ వంటి పలు నాటకాలతోపాటు వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘గోలకొండ’, ‘సుజాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆనందవాణి’ తదితర పతిక్రల్లో పైడిమర్రి రచనలు ప్రచురితమయ్యాయి. 1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథారచయితగా నిలిచారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ అన్ని భారతీయ భాషల్లో అనువాదమైనా.. ఆయనకు రావలసిన గుర్తింపు రాకపోవడం  గమనార్హం.

No comments:

Post a Comment