Followers

31 July, 2020

షహీద్ ఉదమ్ సింగ్ గారి వర్ధంతి

🌹🇮🇳నేడు స్వాతంత్ర్య యోధులు "షహీద్ ఉదమ్ సింగ్" గారి వర్ధంతి🇮🇳🌹

👉షహీద్‌… ఈ పేరు కూడా తెలియని వారు మనలో చాలా మందే ఉంటారు. అణగారిన వర్గాల నుంచి వెలుగులోకి వచ్చిన ఎవరికీ పెద్దగా గుర్తింపు లభించలేదన్నదానికి షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌ జీవితమే నిదర్శనం. సిక్కుల ఆ రోజు సిక్కుల పర్వదినం బైసాఖి… హిందువుల పండుగ రామ నవమి… రెండు పర్వదినాలు ఒకే రోజు వచ్చాయి. ఈ రోజున ఓ పార్కులో బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ముస్లీం సోదరులు కూడా ఈ సభలో పాల్గొన్నారు. నేతల ప్రసంగాలు వింటున్నారు. గుండు సూది వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. ఈ సమయంలో సాయుధ పోలీసులు ఆ పార్కును చుట్టుముట్టారు. రాకపోకలు సాగించే చిన్నటి సందులో పోలీసులు నిలబడ్డారు. అత్యాధునికమైన మెషిన్‌ గన్స్‌ తో రెడీగా ఉన్నారు. ఈ పోలీసుల నాయకుడు ముందుకొచ్చాడు. వచ్చిరావడంతోనే ‘ఫైర్‌’ అంటూ ఉన్మాదిలా అరిచాడు. ఇంకేముంది పోలీసుల చేతిలో ఉన్న మెషిన్‌ గన్స్‌ గర్జించాయి. మొత్తం 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. దీనితో సభలో పాల్గొన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏమైందో తెలుసుకునే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రాణాలు రక్షించుకుందామనుకుని తలో దిక్కుకు పరుగులు తీశారు. అక్కడనే ఉన్న బావిలోకి దూకారు. దాదాపు పది నిమిషాల లోపు దాదాపు వేయి మంది నేలకొరిగారు. మరో 1500 మందిదాక తీవ్రంగా గాయపడ్డారు. బావి నుండి సుమారు 120 మంది మృతదేహాలు బయటపడ్డాయి. పవిత్ర పండుగ దినాన మృత్యుఘోష దద్ధరిల్లింది. అత్యంత హేయమైన ఈ సంఘటన భారతదేశంలోని పంజాబ్‌ లోని ‘జలియన్‌ వాలాబాగ్‌’లో చోటు చేసుకుంది. భరత జాతి గుండెకైన ఈ పెను గాయం ఎప్పటికీ మాననంత తీవ్రమైంది. యావత్తు భారతదేశమే దిగ్భ్రాంతికి లోనైంది. మాటలకందని విషాదం..కాల్పులు జరిపింది ఎవరో కాదు బ్రిటీష్‌ సైనికులు ఫైర్‌ అంటూ కాల్పులకు ఉసిగొల్పిన పోలీసు అధికారి బ్రిగేడియర్‌ జనరల్‌ రెజినాల్డ్‌ డయ్యర్‌. మరొకడు పంజాబ్‌ రాష్ట్ర లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖెల్‌ ఓడ్వయెర్‌. దీనిపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో 1920లో బ్రిటీష్‌ ప్రభుత్వం కంటి తడుపు చర్యగా జనరల్‌ డయ్యర్‌ ను తొలగించింది. కానీ లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ను ప్రమోషన్‌పై సొంత దేశానికి పిలిపించుకుని తన నిజస్వరూపాన్ని బైట పెట్టుకుంది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశాడో ఓ కుర్రాడు. అతడికి 11 ఏళ్లు ఉంటాయి. సమావేశానికి వచ్చే వారికి మంచినీళ్లు అందించాడు. తరువాత జరిగిన ఘోరాన్ని చూసి తట్టుకోలేక పోయాడు. భరతమాతకీ జై… అంటూ నేలకొరుగుతున్న వారిని చూసి చలించిపోయాడు. దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నారో అతడికి అర్థమైంది. బ్రిటీష్‌ పాలకులపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. చిన్ని పిడికెడు గుండెలో కడలిని వీరావేశం ఉప్పొంగింది. తనకు జన్మనిచ్చిచన భరతమాత రుణం తీర్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు 21 ఏళ్లు నిరీక్షించాడు. తనవారిని దారుణంగా కాల్చి చంపిన దుష్టుడు లెఫ్టినెంట్‌ జనరల్‌ మైఖేల్‌ ఓడ్వయెర్‌ను కాల్చిచంపాడు. ఇతడిని ఎక్కడ చంపాడని అనుకుంటున్నారా? వాడి దేశంలోనే వాడి ప్రజల మధ్య కాల్చి చంపాడు. కన్న భూమి రుణం తీర్చుకున్నాడు ఈ విప్లవ ధీరుడు… అతడే. షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌. అనంతరం అరెస్టు అయిన షహీద్‌ లండన్‌ కోర్టులో హాజరు పరిచారు. నా దేశ ప్రజల ఆంకాంక్షను అణిచివేసిన నరహంతకుడిని మట్టుబెట్టాను… ఈ పరాయి పాలన నా దేశానికి శాపంలా మారింది… ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది… వందేమాతరం… దేశం కోసం ప్రాణాలివ్వడానికి భయపడను… గర్వపడుతా అంటూ గర్జించాడు. ఉరికొయ్యలను ముద్దాడాడు. దేశమాత దాస్యశృంఖలాల విచ్ఛేదం కోసం ప్రాణాలర్పించిన ఎందరో తాగ్యధనుల మహోన్నత చరిత్రలో షహీద్‌ ఓ ఉజ్వల తార. తాను ఏం చేసినా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ముందున్న లక్ష్యం ఏమిటో షహీద్‌ ఉద్ధం సింగ్‌కు తెలుసు. తన చిన్న తనంలో జరిగిన జలియన్‌ వాలాబాగ్‌ దురంతం, అప్పుడు జరిగిన మారణహోమం మాత్రం మర్చిపోలేడు. తాను నిర్దారించుకున్న లక్ష్యం ఆయన మనసులో స్పష్టంగా ఉంది. తన ప్రజల ఊచకోతకు కారకుడైన నరహంతక మైఖేల్‌ ఓడ్వయెర్‌ను ఎలాగైనా దునుమాడాలి. తన దేశానికి జరిగిన తీవ్ర పరాభవమానాలకు ప్రతీకారం జరగాలి. ఇదీ తన అత్యంత రహస్య ఎజెండా. కానీ తన లక్ష్యం నెరవేరేదెలా? 1940, మార్చి13న తన సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తను ఎవరినైతై లక్ష్యంగా పెట్టుకున్నాడో అతనిప్పుడు తన స్వదేశమైన ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. అతడ్ని హతమార్చడం అనుకున్నంత సులభం కాదు. అయితే సులభం కాక పోయినా అసాధ్యం మాత్రం కాదని షహీద్‌కు తెలుసు. తను లక్షంగా పెట్టుకున్న శత్రువు లండన్‌లోని క్యాక్సటన్‌ హాలులో ఒక ముఖ్యమైన సమావేశానికి వస్తున్నాడన్న కచ్ఛితమైన సమాచారం అందింది. మైఖేల్‌ ఓడ్వయర్‌ ఈస్టిండియా అసోసియేషన్‌, సెంట్రల్‌ ఏషియన్‌ సొసైటీల సంయుక్త సమావేశంలో ముఖ్య ఉపన్యాసకుడు. వెంటనే షహీద్‌ ఉద్ధం సింగ్‌ అచ్చం బ్రిటీష్‌ దేశస్థుడిలా సూటూ, బూటూ, టోపీతో తయారై సమావేశం జరగనున్న భవనానికి చేరుకున్నాడు. ప్రవేశ ద్వారం వద్ద తనిఖీ కోసం ఉద్ధం సింగ్‌ను గార్డ్‌ ఆపాడు. అతని చేతిలోని పుస్తకాన్ని తీసుకుని అటూ ఇటు తిప్పి సరిగ్గా చూడకుండానే తిరిగి ఇచ్చేశాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. ఆ పుస్తకంలోనే షహీద్‌ ఉద్దమ్‌ సింగ్‌ ఆయుధమైన రివాల్వర్‌ను దాచాడు. బైటకు అదేం కన్పించకుండా గంభీరంగా పుస్తకం. అదే ఆయుధం తీసుకుని వేటాడే పులిలా లోనికి వెళ్ళాడు. సమావేశంలో మైఖేల్‌ ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. ఇండియాలో వేయి మంది భారతీయ శత్రువులను పది నిమిషాల్లోనే ఖతం చేశా… అవసరమైతే ఆ పంజాబ్‌ జలియన్‌ వాలాబాగ్‌ లాంటి ఘటనను ఆఫ్రికాలో కూడా రిపీట్‌ చేస్తాను అని మైఖేల్‌ పేర్కొన్నాడు. అది విన్న ఉద్దం సింగ్‌ వేడి రక్తం ఉప్పొగింది. ఒక్క క్షణం అలస్యం చేయకుండా ముందుకు కదిలాడు. నీకు ఆ అవకాశం మరోసారి ఇవ్వన్రా అంటూ ఉద్దం సింగ్‌ సూటిగా ఓడ్వయర్‌ పైకి రివాల్వర్‌తో కాల్చాడు. మూడు, నాలుగు బుల్లెట్లు ఓడ్వయర్‌ శరీరాన్ని తూట్లు పొడిచాయి. అక్కడికక్కడే కుప్పకూలాడు ఓడ్వయర్‌. బ్రిటీష్‌ అధికారి మైఖేల్‌ ఓడ్వయర్‌ దారుణ హత్య వార్త క్షణంలో ఇంగ్లాండ్‌తో పాటు ప్రపంచమంతా వ్యాపించింది. ఇంగ్లండ్‌ ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఒక ముఖ్య ఉన్నతాధికారిని కాపాడుకోలేకపోవడం సాటి దేశాల ముందు తల తీసేసినట్టయింది. బ్రిటీష్‌ ప్రభుత్వం అవమాన భారంతో తల దించుకుంది. జలియన్‌ వాలాబాగ్‌ హత్యాకాండకు ప్రతీకారంగానే ఓడ్వయర్‌ హత్య జరిగిందని జర్మన్‌ ప్రోపగండా మిషన్‌ అన్ని విషయాలను కుండ బద్దలు కొట్టింది. భారతీయుల బతుకులను బుగ్గి చేస్తున్న బ్రిటీష్‌ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిచ్చేందుకే దుర్మార్గుడైన ఓడ్వయర్‌ను కాల్చి చంపానని ఉద్ధం సింగ్‌ కోర్టులో ప్రకటించాడు. నాకు ప్రాణభిక్ష అవసరం లేదు… నేను దేశం కోసం జీవితాన్ని ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాను… రక్తం తాగే జలగల్లాంటి సామ్రజ్యవాదులైన మీరు నాదేశం నుంచి వెళ్ళిపొండి… మా దేశ ప్రజలకు స్వేచ్ఛనూ, నిజమైన జీవితాన్నీ ఇవ్వండి… అని ఉద్ధం సింగ్‌ పేర్కొన్నాడు. కుల, మత, వర్గ విభేదాలు సృష్టించి విభజించు – పాలించు అన్న సిద్ధాంతాన్ని అనుసరిస్తన్నారే… అందుకే నేను నా పేరును రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌గా మార్చుకున్నాను… అని ప్రకటించాడు. నేనిప్పుడు నేలకొరిగినా వేలాది మంది భారతీయులు అగ్నికీలలై ఉవ్వెత్తున లేస్తారు. అని గర్జించాడు… నేను ఇంగ్లీషు కూలీలకు, రైతులకు, కార్మకులకు వ్యతిరేకం కాదు… సామ్రాజ్య వాద శక్తులు మాత్రమే నాకు శత్రువులు… అని తన వర్గదృక్పథాన్ని చాటుకున్నాడు. 1940, జులై 31 ధైర్య సాహసానికి, త్యాగ దీక్షకు ప్రతీక అయిన భరతమాత ముద్దు బిడ్డ నేలకొరిగాడు. ఇంగ్లండ్‌ జైలులోనే ఉద్ధం సింగ్‌ను ఉరితీసింది బ్రిటీష్‌ ప్రభుత్వం. ఈ మహాత్యాగం 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమానికి ముఖ్య భూమిక అయ్యింది. 1919లో బ్రిటీష్‌ ప్రభుత్వం రౌలత్‌ చట్టం తెచ్చింది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా నిరవధికంగా అంటే ఇంత గడువని లేకుండా ఎమర్జెన్సీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. నిజానికి బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరగకుండా నిరోధించడమే ఈ కొత్త చట్టం. ఈ చట్టంపై మహాత్మాగాంధీ వ్యతిరేకత తెలిపాడు. ఆయన పిలుపునందుకుని దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. పంజాబ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులైన డాక్టర్‌ సత్యపాల్‌, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ చట్టాన్ని తిరస్కరించాలని ప్రజలకు ఉద్భోదించారు. వలస ప్రభుత్వం ఈ ఇద్దరి నేతలను అక్రమంగా నిర్భంధించింది. పోలీసులు వారిని రహస్య ప్రదేశానికి తరలించారు. దానితో పెల్లుబికిన ప్రజాగ్రహ ఫలితమే జలియన్‌ వాలాబాగ్‌ సమావేశం. రౌలత్‌ చట్టాన్ని గౌరవించబోమని ముక్తంకంఠంతో నినదించారు. బ్రిటీష్‌ సర్కారుపై, చట్టాలపై తిరగబడితే పట్టబోయే గతేంటో చాటాలనుకుంది. అందుకోసం కరడుగట్టిన పోలీసు అధికారులను రంగంలోకి దింపింది. ప్రజల ఊచకోత ద్వారా దేశంలో భయాందోళనలు సృష్టించాలనుకుంది. జలియన్‌ వాలాబాగ్‌ దుర్గటన వెనుక ఉన్న మర్మమిదే. షహీద్‌ ఉద్ధం సింగ్‌ దళిత సిక్కు కుటుంబంలో జన్మించాడు. అమృత్‌సర్‌కు 200 మైళ్ల దూరంలోని సునమ్‌ అనే గ్రామంలో పుట్టిన ఉద్ధం నిజంగా సునామీనే సృష్టించాడు. తండ్రి సర్దార్‌ తెహసిల్‌ సింగ్‌ రైల్వే క్రాసింగ్‌ వాచ్‌మెన్‌. ఉద్ధం చిన్నతనంలోనే తల్లి మరణించింది. ఆ తరువాత తన ఇద్దరు పిల్లలైన ఉద్ధం సింగ్‌, సాధూ సింగ్‌ను అనాధాశ్రమంలో చేర్పించాడు. తరువాత తండ్రి కూడా గతించడంతో ఉద్ధం అనాధ అయ్యాడు. స్వతంత్ర సమరంలో చెరగని ముద్ర వేసిన ఉద్ధం సింగ్‌ నివసించిన ఇల్లు సునమ్‌ గ్రామంలో ఇంకా ఉంది. దేశ స్వాత్రంత్యం కోసం ఉద్యమాలు పలు మార్గాల్లో కొనసాగుతున్నాయి. కొందరు శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు విప్లవ మార్గాన్ని అనుసరించారు. మార్గాలు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే బ్రిటీష్‌ వలస పాలనకు చరమగీతం పాడడం. అయితే విప్లవ పోరాటాల ద్వారా మాత్రమే దేశానికి స్వాతంత్య్రం వస్తుందన్న భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఉద్ధం సింగ్‌ లాంటి వారిని వలస ప్రభుత్వం… భారత దేశ తొలితరం మార్క్సిస్టులుగా అభివర్ణించింది. ఉగ్రవాదులుగా ముద్రవేసింది. అమృత్సర్‌ సిక్కుల పవిత్ర నగరం. ఇక్కడే జాతీయ భావాలు వంటబట్టించుకున్నాడు. ధైర్య సాహసాలు, త్యాగనిరతి, క్రమ శిక్షణ వంటి జీవితపు మహత్తర విలువలు వంటబట్టించుకున్నాడు. 1919లో ఈ నగరమే దేశమంతటా స్వాతంత్య్ర కాంక్షను, జాతీయ భావాలను ప్రజ్వరిల్ల జేసింది. ఆ సమయంలో రౌలత్‌ చట్టం రావటంతో అప్పటికే నరనరాన దేశ భక్తి జీర్ణించుకున్న ఉద్ధం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాడు. రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగే ఆందోళనల్లో పాల్గొన్నాడు. తీవ్రవాద మార్గం ఎంచుకున్న ఉద్ధం సింగ్‌ గదర్‌ సంస్ధలో సభ్యుడయ్యాడు. ఈ విప్లవ సంస్ధను సోహాన్‌ సింగ్‌ భక్నా స్ధాపించాడు. భగత్‌ సింగ్‌ రాజగురూ వంటి వారిని తన రాజకీయ గురువులుగా చేసుకున్నాడు. విప్లవ కార్యకలాపాలు కొనసాగించే కాలంలో తన ఉనికి ఎవరికీ తెలియకుండా రకరకాల వేషాలు మార్చాడు. పేర్లూ మార్చాడు. షేర్‌ సింగ్‌, ఉదాన్‌ సింగ్‌, ఉదే సింగ్‌, ఫ్రాంక్‌ బ్రెజిల్‌, వంటి అనేక పేర్లతో ఉద్ధం సింగ్‌ కొనసాగాడు. ఒక సందర్భంలో దేశంలోని మూడు ముఖ్య మతాలకు చిహ్నంగా తన పేరును రామ్‌ మహ్మద్‌ సింగ్‌ ఆజాద్‌ అని ప్రకటించుకున్నాడు. 1924లో ఉద్ధం అమెరికా వెళ్ళడానికి అతనికున్న నేపథ్యం దృష్ట్యా పాస్‌ పోర్టు వంటి అనుమతి పత్రాలు ఎలా లభించాయన్నది ఇప్పటికీ చిదంబర రహస్యమే. బ్రిటీష రహస్య నివేదిక ప్రకారం ఉద్ధం మొదట ఇటలీ చేరుకుని, అక్కడ్నుంచి ఫ్రాన్స్‌, స్వాట్జర్లాండ్‌, ఆఫ్రికా మీదుగా ఇంగ్లాండ్‌ చేరుకున్నాడు. అక్కడే రహస్య జీవితం గడుపుతూ మైఖెల్‌ ఓడ్వయెర్‌ను కాల్పిచంపాడు. ఉద్ధం చేసిన త్యాగం మహా ఉద్యమానికే ఊపిరి అయ్యింది.

💟💟💟💟💟💟💟💟💟💟

No comments:

Post a Comment